Online Puja Services

బయటకొన్న పదార్థాలని దేవుడికి నివేదించవచ్చా ?

3.129.15.234

బయటకొన్న పదార్థాలని దేవుడికి నివేదించవచ్చా ?
-లక్ష్మీ రమణ 

తల్లి తన  పిల్లాడికి అన్నం తినిపించేప్పుడు కొసరి కొసరి తినిపిస్తుంది కదా ! ఆ ప్రేమకోసమే కదా శ్రీవారు నందగోకులంలో యశోదా నందనుడై గోవులు కాశాడు. ఆ ప్రేమకు దాసుడయ్యే కదా , వకుళామాతకి పుత్రుడై , కుబేరుడికి  కలియుగాంతంవరకూ తీరని బాకీ పడ్డాడా గోవిందుడు . అన్నింటికీ మించి ఆ ప్రేమకి బందీ అయ్యేకదా , అడవుల్లో అనంతమైన కస్టాలు అనుభవించాడా రామయ్య ! అమ్మ ప్రేమంటే అంతేమరి ! అది భగవంతుడినైనా పసివాడిగా మార్చేస్తుంది . త్రిమూర్తులే అనసూయామాతకి పొత్తిళ్ళ పాపాలయ్యారుకదా ! అందుకే అమ్మ లాలన భగవంతుడికి ప్రీతిపాత్రం .  భక్తుడికి  మోక్షప్రదాయకం . 

అమ్మవారికి ఎనిమిదేళ్ళ పాపగా దర్శనమివ్వడం ఇష్టమట . అలాగే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం చాలా ఇష్టమట. అందుకే , ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో , అలాంటి మనస్సుతో , ఒక తల్లికి తన పిల్లాడిపై ఉండే వాత్సల్యంతో భగవంతునికి నైవేద్యం సమర్పించాలి .  

ఈ రోజుల్లో బయట కొన్న పదార్థాలని నివేదన చేసేస్తున్నారు. నిజానికి అలా చేయకూడదు .  అవి వ్యాపారనిమిత్తం వండినవి . అమ్మ మనసుతో చేసినవి కాదుకదా ! పైగా ఇవి అనేక రకాలైన అశౌచాలకి గురై ఉంటాయి.  కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. 

నిలవఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని మన బిడ్డలకి పెడతామా ? అలాగే భగవంతునికి కూడా ! ఇంట్లో వండినా సరే ఇలాంటివి నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా కానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరి. హారతి ఇచ్చాకనే నైవేద్యం సమర్పించాలి.

నైవేద్యం పెట్టె పధ్ధతి :

నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి శ్లోకం :

శ్లో|| బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా ||

విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే ...
శ్లో|| పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి |
తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః ||
శ్లో|| యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ |
యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్ ||
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలమ్ పరస్మై
నారాయణేతి సమర్పయామి ||

ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ...

ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా |
అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--

ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |

అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.

మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.

నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.

దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. అందుకే దేవాలయాలలో  దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు తెరవేస్తారు. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు, వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికకి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి.

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi