Online Puja Services

పెళ్ళికూతురు గౌరీ పూజ ఎందుకు చేయాలి ?

3.145.35.99

పెళ్ళికూతురు గౌరీ పూజ ఎందుకు చేయాలి ?
-లక్ష్మీ రమణ

తెలుగువారు తమిళులు ఒక సంప్రదాయాన్ని పాటిస్తారు. పెళ్ళికి ముందర పెళ్లికూతురి చేత తప్పనిసరిగా  గౌరీపూజ చేయిస్తారు . ఇలా  గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అనంతమైన అన్యోన్యత కాబోయే జంటకి సిద్ధించాలన్న ఆకాంక్ష ఉంది . ఇలా వివాహంలో ప్రతి తంతుకీ ఒక వివరణ ఉన్నప్పటికీ , ఈ గౌరీ పూజకి ఉన్న ప్రాముఖ్యత మాత్రం సామాన్యమైనది కాదు . ఆ విషయాలని తెలుసుకుందామా!

దేవతామూర్తులలో స్త్రీ  స్వరూపములన్ని  అమ్మవారి రూపములే. లక్ష్మీ , సరస్వతీ, పార్వతి త్రిమూర్తుల శక్తులు . వారిలో మిగిలిన వారికన్నా పరమేశ్వరునికి ఇల్లాలయిన గౌరమ్మనే పెళ్లికూతురి చేత పూజింపజేయడంలోని ఆంతర్యం చాలా ఉన్నతమైనది . పరమేశ్వరునికి ఇల్లాలిగా  ఉండడం చాలా కష్టం. ఆయన నిత్యం సమాధి స్థితిలో రమించేవాడు.  తపస్సులో నిమగ్నమయి ఉండేవాడు . ఆయన మనసుని గెలుచుకొని, ప్రజాసంక్షేమం కోసం , సమస్త సృష్టి సంక్షేమం కోసం సంసారంలోకి దించడం సామాన్యమైన విషయమా ? 

ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేసికూడా , ఆ మన్మధుడు  సాధించలేకపోయాడో,  ఆ చెరుకు విల్లు తాను స్వయంగా ధరించిన లలిత,  ఏమీ మాట్లాడకుండా కూర్చున్న శివుణ్ణి  సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. తన బిడ్డలకి తండ్రిని చేసింది . మరోవైపు పరమేశ్వరిగా  ఈ సృష్టి నంతటినీ చేసి, తిరిగి తన  అనుగ్రహంతోటే  ఆ లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది.  ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. అదీ ఆవిడ ప్రజ్ఞ .  

నూతన వధువు అంటే స్వయంగా ఆ గౌరము ! ఇక  ఇల్లాలు కాబోతున్న యువతి తాను గౌరమ్మ ఏవిధంగా పరమేశ్వరుని మనసుని గెలిచిందో అదే విధంగా భర్త మనసుని గెలవాలి. ఆవిధంగా ఆయనకీ ప్రీతిని కలిగించే విధంగా ప్రవర్తించాలి . మంత్రిగా ప్రతికార్యమూ తానె నిర్వహించాలి . సర్వకాలములలోనూ  కష్టం వచ్చినా సుఖం వచ్చినా, భార్య భర్తకు విశ్రాంతి స్థానముగా నిలవాలి .  కనుక,  ఆమెకి అటువంటి శక్తి రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. 

ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు కొన్ని చక్కని విషయాలు చెప్తారు. అలా చెప్పాలి కూడా ! ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద, మామమీద, మరిది మీద, ఆడపడుచుల మీద, భర్తకు వేరొక రకమయిన మాటలను  చెప్పి కష్టం కలిగించ కూడదు . తద్వారా ఇంటి విభజనకి కారణం కాకూడదు . అని చెప్తారు . 

ఇక నవ వధువు ‘నా భర్తను అనుసరించి, నా భర్త కు సేవలు చేసి,  నా భర్త పొంగి  పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. నేను కూడా నా భర్త చేత, నీవు ఎటువంటి అనురాగాన్ని ఆ పరమేశ్వరుని వద్ద పొందావో  అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని ఆ గౌరమ్మని ప్రార్ధించాలి .  మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha