Online Puja Services

వివేకానందునికి అమ్మ ఇచ్చిన దర్శన వైభవం

18.117.92.75

దేవాలయాన్ని ధ్వంసం చేశారు. దేవతనీ ధ్వంసం చేసినట్టేనా? స్వామీ వివేకానందునికి అమ్మ ఇచ్చిన దర్శన వైభవం .
- లక్ష్మి రమణ  

ప్రతి సనాతన అనునూయి ప్రశ్నించుకోవాల్సిన సమయం, సందర్భము ఇది. ఆలయాలలో ఉన్న ఈశ్వరుడి లింగాన్ని, ఆలయాన్ని పగలగొట్టేశారు. అందువల్ల ఆయన ఆ ప్రదేశంలో ఉండకుండా అవుతారా ? భగవంతుణ్ణి ‘పరమాత్మ’ అంటున్నాం .  అంటే అన్నింటిలోనూ, సృష్టిలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్నవాడని కదా అర్థం. అటువంటి పరమాత్మ దేవాలయం లేకపోతే ఉండకుండా పోతాడా ? అటువంటప్పుడు ఆలయం నిర్మించాల్సిన అవసరం ఏముంది?

కరెంటు స్విచ్ ఉంది. దానికి కనెక్షన్ ఉన్నంత వరకూ దాన్ని వేసినప్పుడు లైటు వెలుగుతుంది. దాన్ని పీకేస్తే, మళ్ళీ కనెక్షన్ ఇచ్చేంతవరకూ ఆ స్విచ్ పనిచేయదు . కానీ కరెంట్ అలాగే ఉందిగా ! ముట్టుకుంటే, షాక్ కూడా కొడుతుంది . సరిగా వినియోగించుకొనేవాడొచ్చి, ఇంకొక స్విచ్ పెడితే చక్కగా పని కూడా చేస్తుంది . సరిగ్గా భగవంతుని ఆలయాలు కూడా అలాంటివే !!

ఆలయంలో ఒక మూర్తిని నిలిపేటప్పుడు, అక్కడ యోగులైనవారు ద్రష్టలైనవారు వారివారి తపస్సులని ధారపోస్తారు . ఆ శక్తి అక్కడ ఉంటుంది . అటువంటి పరమ శక్తినే మనం తరించడం కోసం ప్రత్యేకంగా గుడి కట్టుకొని ఆరాధిస్తాం . ఆ గుడి పరమాత్మ శక్తికి సంబంధించిన ఉనికిని మనకి తెలియజేడం కోసం ఉద్దేశ్యించినది. అంతే కానీ, ఆయన గుడిలేకపోతే ఉండలేడని కాదు . పంచభూతాలూ తానె అయిన వాడికి, కాలస్వరూపము తానే అయిన వాడికీ వాటినుండీ రక్షణ కల్పించుకొనే గూటి అవసరం ఏముంది?

ప్రత్యేకించి విశేషమైన శక్తి నిలయాలయిన ఆలయాలని ఈ భరతఖండములో శక్తి పీఠములు అంటాము. ఆయా ప్రదేశాలలో శక్తి ఉన్నది , సహజంగా పీఠస్థానంలో ఉన్న (భూమిలోనే ఉన్న ) ప్రక్రుతి శక్తిని గుర్తించి అటువంటి ప్రదేశాలలో ఆలయాలని నిర్మింపజేశారు . అక్కడ ఉపాసన చేయడం వలన సాధకుడు తొందరగా భగవంతుని కృపాని పొందగలరని దర్శనం చేసిన మహా ఋషులు చేసిన గొప్ప సంకల్పం , మన ఆధ్యాత్మిక సంపద ఆ ఆలయాలు . అటువంటి ప్రదేశాలపైన కూడా అనేకసార్లు దండయాత్రలు జరిగాయి . వాటిని నాశనం చేసే యత్నం జరిగింది. అయినా విద్యుత్ ఎప్పటికీ నిలిచి ఉన్నట్టే అక్కడ దైవికమైన శక్తి నిలిచే ఉన్నది . కొలిచిన వారికి కొంగుబంగారమై అనుగ్రహం ఇస్తోంది . సాధకులకు ఆధ్యాత్మిక ఉన్నతికి కారణం అవుతోంది . అందువల్ల కాశ్మీరంలో సరస్వతీదేవి ఆలయం ప్రస్తుతం లేదని బాధ అవసరం లేదు . అక్కడ అమ్మ ఉనికి ఎప్పుడూ సహజంగా ఉంది . తెలుసుకోగలిగితే ఆ శారదా దేవి ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది . 

ఆలయానికి కట్టిన గోడలు గుడి కాదు. ఆ లోపల ఉన్న దివ్య చైతన్యం దేవత. చూడండి, మనిషి కూడా అంతే కదా ! అతనిలో చైతన్యం ఉన్నంత వరకూ  అతను ఒక మనిషి . ఆ చైతన్యం శరీరాన్ని వదిలేశాక, శవం . అది పనికిరాని కేవల శరీరం . ఆ ప్రాణమనే పరమాత్మ దాన్ని ఉపయోగించుకున్నత వరకే అది నిలయం. అలాగే ఆలయం కూడా ! కాబట్టి నిరాకారుడైన ఆ పరమ చైతన్యానికి ఒక గుడి కట్టి ఆరాధించామంటే, అది మనం తరించడం కోసం కానీ, ఆయనకీ ఇల్లుకట్టి పెట్టడం కాదు . ఆయనకీ ఆ అవసరమే లేదు . బ్రహ్మానందమే ఆయనలో ఒదిగి వుండగా మనం ఏ ఆలయాన్ని ఆయనకీ నిర్మించగలం? 

మరి ఆలయాలు ఎందుకు అంటే, ఆ పరమాత్ముని ఒక రూపంలో ధ్యానిస్తే, మనసు ఆయన మీద త్వరగా లగ్నం అవుతుందని . ముందరే మనసనేది ఒక కోతి. దానికి నిలకడ చాలా తక్కువ . ఒక సెకనులో వెయ్యి ఆలోచనలు , లక్ష లంపటాలు తెచ్చి మన దృష్టిని కకావికలం చేయగల గొప్ప ఆల్కెమీ తెలుసు దానికి. అందుకే కదా ‘చిత్తవృత్తి నిరోధం చాలా కష్టం . అలా చేశావా, నీకు భగవంతుని దర్శనం అయినట్టే’ అంటారు పతంజలి మహాత్ములు. అందు వలన పెద్దలు , మహాత్ములు దేవాలయాలు నిర్మించారు . అందులోనూ శక్తిని కలిగిన ప్రదేశాల్లో ,  మంచి చైతన్య శక్తి, దైవీ శక్తి (పాజిటివ్ ఎనర్జీ) ఉన్న ప్రదేశాల్లో ఆలయాలని నిర్మాణం చేశారు . అవి క్షేత్రాలు . అందుకే క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు విహార యాత్రకి వెళ్లినట్టు ప్రవర్తించకూడదు . దైవ ధ్యానంలో గడపాలి . వీలైనంత ప్రశాంతంగా ఆ చైతన్య శక్తిని అనుభూతి చెందుతూ, పరమాత్మునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి . 

గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఒక ప్రవచనంలో,  ఆలయాలని ధ్వంసం చేసేస్తున్నారన్న ఆర్తితో స్వామీ వివేకానందులు అమ్మవారిని ప్రార్ధించినప్పుడు, ఆ అమ్మ స్పందనని ఇలా చెబుతారు.  వివేకానందులు అలా ఆర్తితో అమ్మని ప్రార్ధించగానే ఆవిడ స్వయంగా పలికింది . ఆలయాన్ని విధ్వంసం చేస్తే, నన్ను విధ్వసం చేయగలరా ? చూడు , నీకు నా ఆలయాన్ని చూపిస్తాను. అని తానున్న ఆలయాన్ని ఆయన దివ్య చక్షువులకి కనపడేలా అనుగ్రహించారు. దివ్యమైన బంగారు మందిరం అది. ఆ మణిద్వీపమే ఆమె కోవెల. ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు వివేకానందుల వారు. ఆ తర్వాత తిరిగి ఆవిడే, నాయనా , చూశావా నా కోవెల ఇదీ ! ఇది నా ఇల్లు. ఇక్కడ నుండీ నన్ను తొలగించడం సాధ్యం అయ్యే విషయం కాదు. కాబట్టి, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారట !! 

ఈ ఉదంతం వింటుంటేనే, అమ్మ కరుణ మనపై జల్లులా వర్షించినట్టు అనిపిస్తే చాలు ! జన్మ సార్థకం అయినట్టే ! కాబట్టి ఈ నేలమీద , ఈ భారత ఖండం మీద ఆర్ష సంస్కృతిని నాశనం చేయాలనుకునేవాడే నాశనం అవుతాడు తప్ప , శుద్ధ చైతన్య స్వరూపమైన ఆ పరమాత్మ ప్రకాశం కాదు . ఎవరో ఒక పుణ్యాత్ముడు ఆ శారదాదేవి నిలయంలో  కూడా స్విచ్ కనెక్షన్ ఇచ్చి అక్కడ అమ్మ అనుగ్రహాన్ని సారూప్యంగా లభించేలా చేయాలని, అలా జరుగుతుందని ఆశిస్తూ  సుఖినోభవంతు !! 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore