ఏడుచాపల కథ మన పెద్దలు ఎందుకు చెప్పేవారో తెలుసా !

ఏడుచాపల కథ మన పెద్దలు ఎందుకు చెప్పేవారో తెలుసా !
సేకరణ
అనగనగా ఒక రాజుగారున్నారు . ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులున్నారు . ఏడుగురూ వేటకెళ్లి ఏడుచేపలు తెచ్చారు . వాటిని ఎండబెట్టారు . అందులో ఒకచేప ఎండలేదు. ఈ కాదని చిన్నప్పుడు మనందరమూ విని ఉంటాము . ఈ కథ తెలియనివారు బహుశా తెలుగువారిలో ఎవ్వరూ ఉండరు . ఈ కథలోనూ మనవారు చొప్పించిన విజ్ఞానం అంతులేనిది . ఉగ్గుపాలతోటే, ఆధ్యాత్మికతని రంగలించి తన బిడ్డలకి అందించే మహనీయమైన తల్లులున్న నేల కదా మనది ! కాకపొతే, ఈ కథని విన్నా ఇందులో ఇంతటి అర్థం ఉన్నాడని ఆ చిన్ననాడు అర్థం చేసుకొని ఉండకపోవచ్చు మనం .
మనిషి, ఆయనలోని సప్తధాతువులని ప్రతీకాత్మలుగా తీసుకొని ఈ కథని అలారని అంతర్జాలం ద్వారానే అర్థం అయ్యింది . ఆవివరాలు మీకోసం ఇక్కడ అపొందుపరుస్తున్నాం . చదవండి మరి ! రాజుగారు ఇక్కడ వ్యక్తి . అతనిలోని సప్తధాతువులు ఆయన కొడుకులైన ఏడుగురు రాజకుమారులు .
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.
ఇక, ఈ రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 ) అవే 1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు + మనస్సు .
ఈ అరిషడ్వార్గాలని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. జయించవచ్చు . పూర్తిగా నియంత్రించవచ్చు. అందుకే ఆ ఆరు చేపలూ ఎండాయి . కానీ మనస్సు అనేది ఉందే అది ఎదవా చేప , దాన్ని ఎండబెట్టడం సామాన్యమైన విషయం కాదు . దీన్ని జయించడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా అది ఎండదు. అందుకే కదా , యోగశాస్త్రాన్ని అందించిన పతంజలి మహర్షి చిత్తవృత్తులని నిరోధించడమే యోగము అని చెప్పారు . అందువల్ల మనస్సు అనేది సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది . ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది. మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు. కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. కానీ , మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే కదా . ఆ
ఆ కోరికను కూడా ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఇంతకీ ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది? గడ్డిమేటు. ఈ గడ్డిమేటు అంటే , మరేమిటో కాదు , కుప్ప కట్టిన మనలోని అజ్ఞానం. గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా? మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు. కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే. ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు. దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి అది పోవాలంటే ఏం చేయాలి? ఆవు వచ్చి మేయాలి. ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి? ఆవు అంటే జ్ఞానం. జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది. లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది. అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని ‘జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం’ చెబుతాడు కృష్ణుడు.
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.
ఈ గోవును ఎవ్వరు మేపాలి? గోవులుకాచేవాడు మేపాలి. జ్ఞానాన్ని కాచే ఆ గొల్లవాడు
సమర్ధ సద్గురువు, జగద్గురుడు. జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు. అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.
ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.ఎందుకయ్యా ఆవుని మేపలేదు ? అని అడిగారు . అపుడు ఆ పిల్లాడు అన్నాడు “అమ్మ అన్నం పెట్టలేదు” అన్నాడు. జ్ఞానాన్ని భిక్షగా ఇవ్వగలిగిన ఆ అమ్మ ఎవరు ? అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదంటే, వాడు సంసారం అనే చీమ కుట్టడం వలన, మొహమనే నొప్పి కలిగి భ్రమల్లో అలమటిస్తున్నాడు . ఇక్కడ ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరకపోవడంకాదు, ఆమె ఇచ్చిన జ్ఞాన భిక్షని మొహం అనే అంధకారంలో ఉన్న ఆ పిల్లాడు స్వీకరించకపోవడం వలన అనేది అర్థం చేసుకోవాలి .
చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం. ఇక్కడ మనిషికి ఉండే సంసారమే ఒకపుట్ట.
అందులో ఉండే బాధలే చీమలై కుడుతుఉంటాయి . ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశేవారు. అదన్నమాట విషయం . కాబట్టి మనం గ్రహించాల్సినది ఏమంటే, ఎన్నో కోరికలతో మనం భగవంతుని శరణు వేడినా అంతిమంగా మనకి అవసరమైనది జ్ఞానము మాత్రమే !!